వచన సాహిత్యము | వ్యాసములు | తెలంగాణములో ఆంధ్ర సారస్వత వికాసము (1900 - 1957 మధ్యకాలము) |
తెలంగాణములో ఆంధ్ర సారస్వత వికాసము (1900 - 1957 మధ్యకాలము)
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు
ఇరువదియవ శతాబ్దమున మొదటి యర్ధభాగము గడచి, రెండవ యర్ధభాగము ప్రారంభమైనది. ఈ యేబది సంవత్సరాలలో మనదేశమున చరిత్ర నిర్మాణము జరిగినది. ఈ యర్ధశతాబ్దము హైదరాబాదు చరిత్రలో అత్యంత ప్రధానమైన ఘట్టము. మధ్యకాలపు రాజవంశ పరిపాలన అంతమొంది సంపూర్ణ బాధ్యతాయుత పరిపాలన మేర్పడినది. తరువాత రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్రము) అవతరించినది. రాజకీయముగా జరిగిన యీ మార్పుల ప్రభావము ఆర్థిక, సాంఘిక, సాహిత్య రంగములందు కూడ గోచరించుచున్నది.
హైదరాబాదు ప్రత్యేక పరిస్థితులుహైదరాబాదు రాష్ట్రము ఆనాడు స్వదేశ సంస్థానాలలోనే గాక, వెనుకబడియున్న స్వదేశ సంస్థానాలలో గూడ మొదటిదిగా నుండెను. ఆనాడు ఇక్కడి పరిపాలకులు ప్రజల భాషలయెడ నేమాత్రము సానుభూతి కలిగి యుండలేదు. అంతేకాదు, వారీ భాషల అభివృద్ధిని వ్యతిరేకించి వాని యభివృద్ధిని సర్వవిధముల నిరోధించిరి. తత్ఫలితముగా తెలుగు సరస్వతికి కొంత కాలము అజ్ఞాతవాసము తప్పలేదు. రాజరాజనరేంద్రుని నుండి రఘునాథరాయల వరకు రాజస్థానాలలో ముత్యాల శాలలందు దీనారటంకాల తీర్థమాడిన ఆంధ్ర శారద ఉర్దూ, పార్సీ, అరబ్బీ బిబ్బీల వెనుక నెట్టివేయబడి తబ్బిబ్బు జెందినది. అందుచేత హైదరాబాదు రాష్ట్రమున తెలుగు సరస్వతిని అరబ్బీ, పార్సీ సంప్రదాయాలచేత పరిపోషితమైన ఉర్దూ భాషకు ఊడిగము చేయించు ప్రయత్నాలను ప్రతిఘటించుట భాషాప్రియుల ప్రథమ కర్తవ్యమైనది. ఇండియా యూనియన్లో ఇంగ్లీషువారు ఏమి చేసినప్పటికిని సారస్వత సమావేశాలను నిషేధించి ఆంధ్ర భాషావికాసమునకు అడ్డుపడలేదు. రాజకీయాలతో ప్రమేయము లేని వీరేశలింగం ప్రభృతుల నిరంతర కృషికి నిరోధములు కలుగలేదు. హైదరాబాదు రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల ననుసరించి ఆంధ్ర గ్రంథ పఠనాసక్తిని విద్యావంతులలో నిలిపియుంచుటయే యొక ఘనకార్యమైనది. ఆంధ్ర సారస్వత, సంస్కృతుల వికాసమునకు, అభివృద్ధికి యీ ఘనకార్య సాధనయే ప్రథమ సోపానమైనది. ఈ దృక్పథముతోనే యీ ప్రాంత మందలి తెలుగు భాషా వికాసమును మనము అవలోకించవలసి యుండును.
ఉర్దూ భాషా ప్రభావముఆంగ్లభాషా సంపర్కములేని ఉర్దూ భాషా ప్రభావమును గూడ మనము గమనించవలసి యున్నది. హైద్రాబాదులో ఉర్దూభాష రాజభాషయై, విశ్వవిద్యాలయ బోధనాభాషయై, విద్యాధిక ప్రపంచమున గణుతి కెక్కినది. నలుగురు పెద్దలొక చోట సమావేశమైనచో వారి నాలుకలమీద ఉర్దూ సరస్వతియే నాట్యమాడినది. తత్ఫలితముగా విద్యాధికులలో రెండు భిన్నవర్గా లేర్పడినవి. సంస్కృతాంధ్రములందు పాండిత్యము కలిగి, పల్లెటూళ్ళలో నివసించుచు, అధునాతన ప్రపంచమునకు దూరముగా నుండి రాజాదరణ లేక, గ్రాసవాసో దైన్యమున కృశించు చుండిన పండిత బృందము మొదటి వర్గము. కొలదియో గొప్పయో పరిచయము ఉర్దూ, పార్సీ భాషలలో కలిగి లౌకిక ప్రపంచమున వ్యవహర్తలైన ఆస్తిపరులు రెండవ వర్గము. ఆంగ్లభాషతో యీ రెండు వర్గాలకు కూడ సంబంధము అల్పమే. అందుచేత తెలంగాణములోని ఆంధ్రభాషపైన ఆంగ్లభాషా ప్రభావము ఆలస్యముగా పడినదని చెప్పవవలసి యున్నది. ఉర్దూభాష మరియు ఆంగ్లభాషా ప్రభావాలు పూర్తిగా భిన్నమైనవి. ఉర్దూ వాఙ్మయము పరిమితమైనది. ఆంగ్లవాఙ్మయము అపరిమితమైనది. ఆంగ్లభాషతో పోల్చినప్పుడు ఉర్దూప్రాయము కడు కొద్దిది, ఉర్దూ భాష ప్రత్యేకత శృంగారము, సూఫీ తత్వము. ఆంగ్లభాష ప్రపంచ విజ్ఞానమునకు, ప్రపంచ సాహిత్యమునకు ఆటపట్టు. ఉర్దూ అప్పుడప్పుడే పరిపాలకుల భాష యగుటకు ప్రాకులాడు స్థితిలో నుండెను. ఆంగ్లభాష సకల ప్రపంచమునకు వ్యవహారయోగ్యమై, వాడుకలోనికి వచ్చియుండెను. కావుననే ఇండియా యూనియన్లో ఆంగ్లభాషవలె, అప్పటి హైదరాబాదు రాష్ట్రములో ఉర్దూభాష పాఠకులను ఉత్తేజితులను జేసి, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక వాఙ్మయములందు చెప్పదగిన పరిణామాలను కలుగ జేయలేక పోయినది. కావున హైదరాబాదు రాష్ట్రములో ఆంధ్రభాషా వికాసము పూర్వ వాఙ్మయ పఠనము మీదనే యెక్కువ ఆధారపడవలసి వచ్చినది. భావ కవిత్వపు వెల్లువ, నవలా రచనా వ్యాసంగ ప్రవాహము తెలంగాణ క్షేత్రమున తక్కువగా పొంగి పొరలినట్లు కనబడు చున్నది. హైదరాబాదులో ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసము ముఖ్యముగా నాలుగు మార్గముల జరిగినట్లు స్పష్టము కాగలదు. ఒకటి చరిత్ర పరిశోధన, రెండవది విజ్ఞానవాఙ్మయ నిర్మాణము, మూడవది కథానికా రచన, నాలుగవది ప్రభుత్వమునకు ప్రజలకు మధ్య జరిగిన సంఘర్షణచే ప్రేరితమైన కవితా రచన.
సంస్థానాల సేవతెలంగాణమున ఆంధ్రభాషా వికాసమునకు తోడ్పడిన సంస్థానాధీశ్వరులను యీ సందర్భమున ప్రశంసించవలసి యున్నది. ప్రభుత్వ విధానము ప్రజల భాషల అభివృద్ధికి ప్రతికూలముగ నున్న సందర్భమున నిజామునకు సామంతులై యున్నప్పటికిని గద్వాల, వనపర్తి, అమరచింత మొదలైన సంస్థానాధీశ్వరులు తెలుగు కవులను ఆదరించి, పోషించినారు. ఆధునిక యుగ నిర్మాతలైన తిరుపతి వేంకటకవుల వంటివారు తమ సారస్వత జైత్రయాత్రల సందర్భమున యీ సంస్థానాలకు అరుగుదెంచి సన్మానములను పొందినట్లు "నానారాజ సందర్శనము" తెలుపుచున్నది. ఈ ఆస్థానాలు మినుకుమినుకు మని తెలుగుభాషా దీపములు వెలుగుచున్న ప్రమిదలలో కొంత చమురు పోసి, అవి ఆరిపోకుండునట్లు కాపాడిన గౌరవము సంపాదించుకొనినవి.
లక్ష్మణరావుగారి లక్ష్యాలుహైదరాబాదు రాష్ట్రమున ఆంధ్ర సారస్వత వికాసానికి వెలుగుగల దారిని జూపిన విజ్ఞాని, ధన్యజీవి కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు. లక్ష్మణరావుగారు మహారాష్ట్ర దేశమున విద్యాభ్యాసము చేసి, మహారాష్ట్ర భాషలో ప్రావీణ్యము గడించి, అక్కడ జరుగుచున్న వాఙ్మయ కృషిని అవగాహన చేసుకొనిన ఆంగ్ల విద్యాధికులు. లక్ష్మణరావుగారు హైదరాబాదు లోని ప్రత్యేక పరిస్థితులను పరిశీలించి, వాఙ్మయ వికాసానికి మూడు ముఖ్యమైన మార్గములను చూపించినారు. ఒకటి గ్రంథాలయోద్యమము. ఊరూర గ్రంథాలయాలను స్థాపించి, నిరక్షరాస్యత, అజ్ఞానములందు మునిగి యున్న ప్రజలకు విజ్ఞానము ప్రసాదించి, మన సాహిత్యపు రుచులను ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకతను గ్రహించి లక్ష్మణరావుగారు ఈ ఉద్యమమానికి బలమైన పునాదులు వేసిరి. స్వయముగా హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము, హనుమకొండలో రాజరాజనరేంద్ర భాషానిలయమును స్థాపించిరి. తరువాత తెలంగాణలో అనేక గ్రంథాలయాలు అవతరించి, సభలు సమావేశాల ద్వారా మంచి చైతన్యము కలుగజేసి, అనేక యువ రచయితల భావనాశక్తికి దోహదము గావించి అమోఘమైన సేవ జేసినవి. చరిత్ర, విజ్ఞానము లక్ష్మణరావుగారు అభిమానించిన వాఙ్మయ విశేషములు.
ఈ రెండు మార్గముల రచనలు గావించవలసిన ఆవశ్యకతను లక్ష్మణరావుగారు తెలంగాణా ఆంధ్రులకు తెలియజేసినారు. లక్ష్మణరావుగారి విజ్ఞాన చంద్రికా గ్రంథమండలికి హైదరాబాదు జన్మస్థానము. చరిత్ర పరిశోధనమున వారి అనుచరులకు, ఏకలవ్య శిష్యులకు హైదరాబాదు ఆటపట్టయినది. ఈ ముప్పది సంవత్సరాల కాలమున ప్రకటితమయిన గ్రంథజాలమును పరిశీలించినచో వానిమీద విజ్ఞానము చరిత్రల ప్రబల ప్రభావము మనకు వెల్లడి కాగలదు. లక్ష్మణరావుగారిచే స్థాపితమై, వారి అనంతరము వారి స్మారకార్థము "లక్ష్మణరాయ పరిశోధక మండలి" యను నామకరణము పొందిన పరిశోధనా సంస్థ ఆంధ్రదేశ చరిత్రలో అజ్ఞాతముగా నున్న సంగతులను వెల్లడిచేయగల అనేక శాసనాలను వ్యయ ప్రయాసల కోర్చి సేకరించి, పరిశోధించి, పరిశీలించి తెలంగాణ శాసనములను సంపుటముగా ప్రకటించిరి. ఇది ఆంధ్రదేశమంతయును గర్వించ దగిన కృషి. ఆంధ్రభాషా వికాసమునకు అత్యంత ఉపయుక్తమైన సేవ.
విజ్ఞాన సంస్థలు, వివిధ గ్రంథమాలలువిజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, తత్ప్రచురణలు అనేక ఇతర గ్రంథమాలల అవతరణకు కారణభూతమైనవి. గోలకొండ, కిన్నెర, దివ్యవాణి, సుకృతి, ప్రసాదము, మాతృభారతి, ఆంధ్రశ్రీ, కాకతీయ, పూలతోట, వీరేశలింగం కవికంఠాభరణ, కృషి ప్రచారిణి, శివధర్మ, విజ్ఞాన ప్రచారణి, వేంకటేశ్వర, కావ్యమాల గ్రంథమాలలు ఈ సందర్భమున పేర్కొనవలసి యున్నది. అణా, దేశోద్ధారక, ఆంధ్రకేసరి గ్రంథమాలలు కొద్దివెలతో ప్రజలకు అవసరమైన విజ్ఞానమును ప్రసాదించు ఉత్తమ వచన గ్రంథములను ప్రకటించినవి. సాధన సమితి ఆంగ్ల విద్యాభూషితులయిన యువకులు స్థాపించి నిర్వహించిన సంస్థ. ఇందులో కథకులు అధికసంఖ్యాకులు. ఈ సమితి తెలంగాణా రచయితల ఖండకావ్యములను, కథానికలను విరివిగా ప్రకటించి ప్రశంసనీయముగా భాషాసేవ జేసినది. యువకులు నిర్వహించిన మరొక సంస్థ సాహితీ మేఖల. ఆశయము కవితారచన, కావ్య ప్రచారము. ఇందులో కవులు అధిక సంఖ్యాకులు. నూతన భావాలతో పాటు యీ కవులు ప్రబంధముల పక్వతతో కూడిన శైలిని అలవరించుకొనినారు. ఈ యొడ్డాణములో పొదిగిన రత్నములు కొన్ని నిజముగా సానలు దీరియున్నవి. ఈ శతాబ్దములోనే అవతరించిన ఆంధ్ర చంద్రికా గ్రంథమాల, విజ్ఞానవర్థనీ పరిషత్తులు సరిగా విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ఆశయాలతోనే కృషి చేసి, వివిధ విజ్ఞాన శాఖలకు సంబంధించిన మంచి గ్రంథములను ప్రకటించినవి.
పత్రికల ప్రశంసనీయ కృషిభాషావికాసమునకు పత్రికలద్వారా జరిగిన కృషిని ప్రత్యేకముగా పేర్కొనవలసి యున్నది. ఇండియన్ యూనియన్లోని పత్రికలకున్న స్వాతంత్ర్యములో నూరవ భాగమైనను హైద్రాబాదు పత్రికలకు లేక పోవుట జగత్ప్రసిద్ధమైన సత్యము. హైద్రాబాదులోని రచయితలకు తగినంత ప్రచారము కలుగక పోవుటకును, ఇతరాంధ్రదేశ రచయితలతో వారికి పరిచయము కలుగక పోవుటకును పత్రికా స్వాతంత్ర్యము లేకపోవుట ముఖ్యకారణమని చెప్పవచ్చును. అయినప్పటికినీ తీవ్ర ప్రతిబంధకాలను అధిగమించి కొంతకాలమైనను సేవచేసిన పత్రికలు కొన్ని గలవు. వీని పూర్వ సంపుటాలను పరిశీలించినచో కథకులకు, కవులకు, వ్యాసకర్తలకు, విమర్శకులకు, పరిశోధకులకు, నాటికా రచయితలకు ప్రోత్సాహము నిచ్చి యీ పత్రికలు భాషావికాసమునకు తోడ్పడినట్లు విశదము కాగలదు. ఈ పత్రికల కృషి ఫలితముగా ఉన్నతవిద్య నభ్యసించిన యువకులు నూతన రీతుల భాషాసేవకు బద్ధకంకణులైరి. వీరిలో సకలాంధ్ర ప్రశస్తి గాంచిన కథకులు, రచయితలు క్రమముగా సిద్ధమైనారు. గోలకొండ, తెనుగుపత్రిక, నీలగిరి, సుజాత, శోభ, భాగ్యనగర్, సారథి, ఆంధ్రాభ్యుదయము మొదలైన పత్రికలలో ప్రకటితమైన వాఙ్మయము నాటి తెలంగాణములో జరిగిన భాషా వికాసమునకు మంచి నిదర్శనము. ఈ కాలమున ఆంగ్లభాషా పరిచయముతో పాటు ఆంధ్రభాషలో ప్రావీణ్యము సంపాదించిన యువకులు ముందంజవేసి కథలు, గేయాలు, వ్యాసాలు మొదలయినవి వ్యావహారిక భాషలో రచించసాగిరి. హైద్రాబాదు పోలీసు నాజీశక్తుల నగ్న నృత్యము, రజాకార్ల రాక్షస కృత్యములు, నిజాము నిరంకుశ చర్యలు, వానిపైన తిరుగుబాటు యువకుల గేయాలలోను, రచనలలోను శక్తివంతమైన శైలిలో వ్యక్తీకరించుట జరిగినది. సజీవమైన భాషలో కండగల కవిత్వమీ సంఘర్షణ సాహిత్యమున సమృద్ధిగా అవతరించినది. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ మందంతటను శాఖోప శాఖలతో విస్తరించి, వయోజనులకు రాత్రి పాఠశాలలను నిర్వహించి, పరీక్షలను నిర్వహించి, మన భాషలోని మంచి పుస్తకములను ప్రజాసామాన్యముచే పఠింపజేసి, స్వయముగా ప్రజలకు అవసరమైన విజ్ఞాన ప్రదములగు ఉత్తమ గ్రంథములను ప్రకటించి, దేశములో ఒక మంచి సాహిత్య వాతావరణము కలుగజేసి రచనాశక్తికి సర్వవిధముల దోహద మొసగినది.
విశిష్టమైన ఫక్కీలో తెలుగుభాషా వికాసముఈ విధముగా హైద్రాబాదులో రచనా వ్యాసంగము, ఆంధ్రభాషా వికాసము ఒక విశిష్టమైన ఫక్కీని జరిగినవి. పరిశోధన, విజ్ఞానము, కథానిక, సంఘర్షణ, యుగయుగమునకు సంబంధించిన అభ్యుదయ కవిత్వము, తెలంగాణ రచనలలో ప్రధాన స్థానము నాక్రమించుచున్నవి. ఆంధ్ర భాషకు, ఆంధ్ర సంస్కృతికి కృత్రిమమైన సరిహద్దులు, పొలిమేరలు కల్పించుటకు వీలులేదు. అట్టి ప్రయత్నాలు నెరవేరగల అవకాశాలు అంతరించినవి. సమగ్రాంధ్ర దృక్పథముతో సాహిత్యకృషి జరుగవలసి యున్నది. అట్లు జరుగుచున్నది కూడ. కృష్ణా గోదావరీ తుంగభద్రలు సకలాంధ్రులకు సమిష్టిస్వత్వము. నన్నయ, తిక్కన, పోతన మొదలగు మహాకవులు వివిధ ప్రాంతాలలో అవతరించి ఆంధ్రభాషను ఆరాధించి నప్పటికిని ఆంధ్రజాతి కంతకు వారు సమానముగా గౌరవపాత్రులై యున్నారు. వారి కృషి సకల ప్రాంతములందలి ఆంధ్రభాష అభ్యుదయమునకు మార్గదర్శకమైనది.
![]() |
![]() |